హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం కారణంగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ రోజుకో అబద్దం ఆడుతూ నెట్టుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు హామీలలో ఒక్కటి కూడా అమలు జరిగిన పాపాన పోలేదన్నారు. జగదీశ్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో కిషన్ రెడ్డిలు నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డిని ఏకి పారేశారు. నువ్వు తిట్టినట్టు చేయి నేను అరిచినట్టు చేస్తా అంటూ నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పీఏ లాగా ఏమన్నా పని చేస్తున్నాడా? అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటే అని నిన్న తేలి పోయిందన్నారు. మొన్న ప్రధాని పిలిచారు.. మ్యాచ్ ఫిక్సింగ్ లో తిట్టుకున్న ఇద్దరు (రేవంత్ రెడ్డి ,కిషన్ రెడ్డి) ఢిల్లీలో డ్యూయెట్ పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రికి పీఏగా పని చేస్తున్నారా? అన్న అనుమానం నెలకొందన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిని భయపడితే మరో కేంద్ర మంత్రిని కలిపించడం భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని నిలదీశారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఈ హైబ్రిడ్ సీఎం బీజేపీ వైపే అని అందరికీ తెలుసు అన్నారు. ఎక్కువ కాలం ప్రజలను మభ్య పెట్టడం సాధ్యం కాదన్నారు. ఏదో ఒక రోజు బండారం బయట పడక తప్పదని హెచ్చరించారు జగదీశ్ రెడ్డి.















