విశాఖపట్నం (కైలాసగిరి) : నిరంతరం ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలలో పని చేసే పోలీసులకు యోగా ఒక టానిక్ లాగా పని చేస్తుందన్నారు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి. పోలీస్ అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడిని అధిగమించి, శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ వింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది కోసం మూడు రోజుల పాటు ఉచిత “హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్” (ధ్యానం) శిక్షణ, సాధన తరగతులను కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో నిర్వహించారు.ఈ ముగింపు కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీస్ సిబ్బందితో కలిసి స్వయంగా ధ్యాన సాధన చేశారు.
ఈ సందర్భంగా రేంజ్ ఐజీ మాట్లాడారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు , నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఒత్తిడి నివారణకు అద్భుతంగా దోహదపడే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించు కోవాలని కోరారు. ఇక్కడ నేర్చుకున్న ధ్యాన ప్రక్రియను సిబ్బంది తమ దైనందిన జీవితంలో నిరంతరం ప్రాక్టీస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెరైన్ అదనపు ఎస్పీ కె.శ్రావణి, ఇన్స్పెక్టర్ లు రమేష్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవరావులతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది , హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


















