నల్లగొండ జిల్లా : మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టడం పై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతో పార్టీ పెట్టడాన్ని ఓ జోక్ గా అభివర్ణించారు. ఒక ఉద్యమ కారుడు బిడ్డ అనేదే కవిత గుర్తు అని అన్నారు. అంతకు మించి ఆమెను ఎవరూ పట్టించు కోరని ఎద్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డి. కూతురికి తండ్రే అంటే ప్రేమ ఉండాలన్నారు. కానీ మొదటి సమావేశంలో తండ్రిని కవిత తిట్టి మర్యాద పోగొట్టుకుందన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే.
అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదన్నారు. ఆమె నిర్దోషి అని తేలనే లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ నడిపినంత సులువు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కాదు కదా తను సొంతంగా పోటీ చేసినా డిపాజిట్ రాదని జోష్యం చెప్పారు. ఇదే సమయంలో తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై కూడా స్పందించారు రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది, నాకు పెద్ద పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేస్తానని అన్నారు.
















