తిరుమల : టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అప్రమత్తమైంది. నిత్యం వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించు కునేందుకు వస్తుంటారు. కొందరు తమ విలువైన పర్సులు, బ్యాగులు, ఆభరణాలు పోగొట్టుకుంటారు. తాజాగా విలువైన వస్తువులు కలిగిన బ్యాగ్ ను ఓ భక్తుడు పోగొట్టుకున్నాడు. వెంటనే స్పందించింది. ఆ బ్యాగ్ ను సదరు భక్తుడికి అందించింది. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి గుర్తించి, అందులోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్తో పాటు ఇతర విలువైన వస్తువులను యథాతథంగా యజమానులకు భద్రంగా అప్పగించారు.
తెలంగాణకు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు మేదరమిట్ట నుండి గోగర్భ డ్యాం సమీపంలోని మఠాలకు మహేంద్ర టాక్సీ జీప్లో ప్రయాణిస్తున్న సమయంలో తమ బ్యాగ్ను వాహనంలోనే మరిచి పోయారు. విషయం గుర్తించిన వెంటనే టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే సీసీటీవీ ప్లేబ్యాక్ ఫుటేజీలను పరిశీలించి సంబంధిత జీప్ను గుర్తించారు.
అప్పటికే తిరుపతికి చేరుకున్న డ్రైవర్ను సంప్రదించి బ్యాగ్ను భద్రంగా స్వాధీనం చేసుకుని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో భక్తుల సమక్షంలో బ్యాగ్ను తెరిచి అందులోని విలువైన వస్తువులను ధృవీకరించి అప్పగించారు.
ఈ బ్యాగ్ లో రూ.23,000 నగదు, 4 గ్రాముల బంగారు ఉంగరం, 12 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు, ఒప్పో మొబైల్ ఫోన్ , సుమారు రూ.1.20 లక్షల విలువైన దంత పరికరం ఉంది. వాటిని భక్తుడికి అందించారు. విలువైన వస్తువులను ఎలాంటి నష్టం లేకుండా తిరిగి అందజేసిన టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, విజిలెన్స్ సిబ్బందికి భక్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టీటీడీ భద్రతా వ్యవస్థను అభినందించారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.



















