తిరుమల : హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో, అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవో, అదనపు ఈవోలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు జరుగుతున్నాయని, భక్తులందరూ సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు టీటీడీ ఈఓ మరియు అదనపు ఈఓ లు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి మూలమూర్తికి జరిగిన ప్రత్యేక అభిషేకంలో కూడా పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణలు మేళతాళాల నడుమ టీటీడీ ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.



















