న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది ఢిల్లీలోని ఎక్సైజ్ స్కాం కేసు. ఇందులో మాజీ సీఎం , ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం సిసోడియా, మరో మంత్రి జైలుకు వెళ్లారు. వీరంతా బెయిల్ పై బయట ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. 2024లో దాఖలైన ఈ పిటిషన్ జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇప్పటికే ఉపశమనం కల్పించింది. అరవింద్ కేజ్రీవాల్కు 2021-22 ఎక్సైజ్ విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మంజూరైన బెయిల్ను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దావా సమర్పించింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు ఆవశ్యకత , అవసరం అనే అంశానికి సంబంధించిన మూడు ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూనే, ఆరోపిత మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు, జూన్ 20, 2024న, ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్పై బెయిల్ మంజూరు చేసింది, అయితే ఈడీ పిటిషన్ మేరకు హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ఆ సంస్థకు హైకోర్టు చివరి ,తుది అవకాశం కల్పించింది. ఈ కేసులో ఆ సంస్థ పదేపదే వాయిదాలు కోరడాన్ని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఎటువంటి కారణం లేకుండానే విచారణ ప్రక్రియను సాగదీస్తున్నారని ఆరోపించారు. ఆరోపిత మనీ లాండరింగ్ , అవినీతి కేసులలో ఆప్ జాతీయ కన్వీనర్ను ఈడీ, సీబీఐ వరుసగా మార్చి 21, జూన్ 26 లలో అరెస్ట్ చేశాయి.
