అమరావతి : వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానల్ పై దాడికి యత్నించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. మంగళవారం ఆయన సామాజిక వేదిక ద్వారా స్పందించారు. ఎబీయన్, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తెగబడటం సరి కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. ఒకవేళ ఏమైనా అభ్యంతకరమైన కామెంట్స్ చేసినా లేదా రాసినా , ప్రసారం చేసినా వాటికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అలా చేయకుండా భౌతికంగా దాడులకు దిగాలని అనుకోవడం మంచి పద్దతి కాదని సూచించారు పీవీఎన్ మాధవ్.
ఇలాంటి దాడులకు దిగడం అంటే మీడియా స్వేచ్ఛ ను హరించడం తప్పా మరోటి కాదన్నారు. రాజధాని అమరావతి విషయంలో విషం చిమ్మిందే జగన్ రెడ్డి అని, ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మూడుసార్లు మూడు మాటలు మార్చిన జగన్ ను ముందు వైసీపీ శ్రేణులు నిలదీయాలని డిమాండ్ చేశారు. కథనాలపై అభ్యంతరాలు ఉంటే.. ఖండించాలి, చర్చించాలన్నారు. మీకు సాక్షి మీడియా ఉందని, అందులో మాపై కూడా దారుణమైన కథనాలు వస్తున్నాయని వాపోయారు పీవీఎన్ మాధవ్. కనీసం కూటమి పార్టీల నేతల ఖండనలు కూడా వేయడం లేదన్నారు. అమరావతిపై ద్వేషం పెంచుకున్న జగన్ రెడ్డి ఇప్పటికే అదే పంధాలో వెళుతున్నారంటూ మండిప్డడారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరారు.
















