గుంటూరు జిల్లా : పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిందన్న అక్కసుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ రెడ్డిని, ఆయన పార్టీ నేతలను ఏకి పారేశారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. మామిళ్ళ పల్లి గ్రామం అంశాన్ని కుల రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. శాంతి భద్రతల విఘాతం కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేయడమే పనిగా పాలన సాగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్దాంత పరమైన పోరాటాలు చేస్తూ వచ్చిందన్నారు ధూళిపాళ నరేంద్ర. అందుకే వైసిపినీ ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని, బుద్ది రావడం లేదన్నారు.
ప్రజా వేదిక ద్వారా మీరు చేసిన విధ్వంసం మొదలు ,రప్పా రప్పా అంటూ యువతను రెచ్చ గొడుతూ వస్తున్నది మీరు కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే. చివరికి జడ్జిలు, వారి కుటుంబాలపై సైతం వైసీపీ వారు అనుచిత వ్యాఖ్యలు చేసింది ప్రజలు ఇంకా మరిచి పోలేదన్నారు. అందుకే వారిని సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. జగన్ రెడ్డికి ఇంకా సోయి లేకుండా పోయిందన్నారు. జనం ఛీ కొట్టినా ఇంకా నిరాదారమైన ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ధూళిపాళ నరేంద్ర. బోండా ఉమా కారుపై మాచర్లలో దాడి చేసింది ఎవరో తెలియదా అన్నారు. తోట చంద్రయ్యను చంపిందెవరు..? ప్రజలు ఇంకా ఇవి అన్ని మరచి పోలేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి కారు కింద నీ కార్యకర్త పడి చనిపోతే పరామర్శించిన పాపాన పోలేదన్నారు.


















