Wipro : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి విప్రో (Wipro) లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రూ.3,246.2 కోట్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదు చేసిన రూ.3,208.8 కోట్ల లాభంతో పోలిస్తే ఒక శాతం వృద్ధి. సంస్థ ఆదాయం కూడా వార్షిక ప్రాతిపదికన 1.7 శాతం పెరిగి రూ.22,697.3 కోట్లకు చేరుకుంది. అయితే, జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోలిస్తే లాభం 2.5 శాతం తగ్గి, ఆదాయం 2.5 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
విప్రో (Wipro) ఆదాయంలో ప్రధాన భాగం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం నుండి వచ్చింది — మొత్తం ఆదాయంలో 34.3 శాతం. కన్స్యూమర్ విభాగం 18.2 శాతం, ఎనర్జీ–మాన్యుఫాక్చరింగ్–రిసోర్సెస్ విభాగం 17.4 శాతం, టెక్నాలజీ–కమ్యూనికేషన్స్ రంగం 15.6 శాతం, హెల్త్కేర్ విభాగం 14.5 శాతం వాటాను నమోదు చేశాయి.
Wipro – ఏఐ విభాగంలో కొత్త చొరవ – ‘విప్రో ఇంటెలిజెన్స్’
కృత్రిమ మేధ (AI) సేవలను విస్తరించేందుకు కంపెనీ “విప్రో (Wipro) ఇంటెలిజెన్స్” పేరుతో కొత్త ఏకీకృత సూట్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా ఏఐ ఆధారిత పరిష్కారాలు, ఆఫరింగ్స్ మరియు సేవలను సమగ్రంగా అందించనుందని విప్రో (Wipro) సీఈఓ & ఎండీ శ్రీనివాస్ పల్లియా తెలిపారు. కస్టమర్లు ఏఐ ప్రాజెక్టులపై అధికంగా పెట్టుబడులు పెట్టుతున్నందున ఈ విభాగంలో దృష్టి పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇతర కార్పొరేట్ అప్డేట్లు
జేఎ్సడబ్ల్యూ ఎంజీ మోటార్
విండ్సర్ ఇన్స్పైర్ ఎడిషన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ షోరూమ్లో జేఎ్సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సీసీవో వినయ్ రైనా, జోనల్ హెడ్ సౌరవ్ ప్రకాశ్, పీపీఎస్ మోటార్స్ ఎండీ రాజీవ్ సంఘ్వీ ఈ కొత్త మోడల్ను ఆవిష్కరించారు. విండ్సర్ విడుదలైన ఏడాదిలోనే 40,000 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది.
ర్యాపిడో భాగస్వామ్యాలు
ర్యాప్షేరింగ్ ప్లాట్ఫారమ్ ర్యాపిడో గోఇబిబో, రెడ్బస్, కన్ఫర్మ్టికెట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. విమాన, హోటల్, బస్, రైలు టికెట్ బుకింగ్స్ సేవలను ఒకే వేదికలో అందించడానికి ఈ భాగస్వామ్యాలు ఏర్పాటు చేశారు. దీంతో ర్యాపిడో వన్ స్టాప్ ట్రావెల్ యాప్గా అవతరించింది.
ఎల్ అండ్ టీ ఫైనాన్స్
సెప్టెంబర్ త్రైమాసికానికి సంస్థ రూ.735 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం పెరుగుదల. రుణాల మంజూరు కూడా 25 శాతం పెరిగి రూ.18,883 కోట్లకు చేరుకుంది.
రోల్స్–రాయిస్–భారత్ ఫోర్జ్ ఒప్పందం
బ్రిటిష్ ఇంజిన్ దిగ్గజం రోల్స్–రాయిస్ పెరల్ 700, పెరల్ 10ఎక్స్ ఇంజన్ల కోసం ఫ్యాన్ బ్లేడ్స్ తయారీ, సరఫరా విషయంలో భారత్ ఫోర్జ్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి భారత్ నుంచి సప్లయ్ చెయిన్ ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో ఈ భాగస్వామ్యం జరిగిందని రోల్స్–రాయిస్ తెలిపింది.
బీఎల్ఎస్ ఇంటర్నేషనల్
చైనాలో భారతీయ వీసా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి మూడేళ్ల కాలానికి పొందినట్లు ప్రకటించింది. బీజింగ్, షాంఘై, గ్వాంగ్ఝూ నగరాల్లో సెంటర్లు ప్రారంభించనుంది.
భారతి ఎయిర్టెల్–ఐబీఎం ఒప్పందం
ఎయిర్టెల్ క్లౌడ్ సేవలను విస్తరించేందుకు ఐబీఎంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఐబీఎం సొల్యూషన్లు ఎయిర్టెల్ క్లౌడ్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
సీఎన్హెచ్–న్యూ హాలెండ్ ట్రాక్టర్
‘వర్క్మాస్టర్ 105 హెచ్వీఏసీ క్యాబిన్’ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 106 హెచ్పీ సామర్థ్యంతో 3.4 లీటర్ టీఆర్ఈఎమ్–4 ఇంజిన్తో రూపొందిన ఈ ట్రాక్టర్ ధర రూ.35 లక్షలు.
ఓలా ఎలక్ట్రిక్
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశీయంగా తయారైన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో రూపొందిన తన తొలి రెసిడెన్షియల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ “ఓలా శక్తి”ని ఆవిష్కరించింది.
Also Read : Infosys Growth : ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక లాభాలు 13.2% పెరిగి ₹7,364 కోట్లు
