నల్లగొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తామని ప్రకటించారు. గత రెండు సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధికి సుమారు రూ .2000 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా అవసరమైతే మరో 2000 కోట్లు కూడా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు మంత్రి. నల్గొండ ప్రజల కోరిక మేరకు కార్పొరేషన్ హోదా కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. నన్ను ఆప్యాయంగా ఆదరించిన నల్గొండ ప్రజల కోసం ఎంత చేసినా తక్కువేనని అన్నారు కోటి రెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడిందన్నారు.
నల్లగొండ పట్టణంలో సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించడం మరింత సంతోషం కలిగించిందని చెప్పారు. మంచి నీటి సరఫరా, పార్కుల అభివృద్ధి, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, స్మశానవాటిక అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి పనులు పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయనున్నాయని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండను ఆధునిక, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యమన్నారు.
















