హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శాసన సభ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా జర్నలిస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, మీ అంతకు మీరు అపోహలకు గురి కావద్దని సూచించారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది ఎప్పుడైనా ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు పెట్టుకోవాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గత పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్లపై మీరు ఒత్తిడి చేయలేదని, కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ సర్కార్ జర్నలిస్టుల ఫ్రెండ్లీ సర్కార్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాను రవీంద్ర భారతిలో సభ పెట్టి పేట్ బషీరాబాద్ స్థలం ఇచ్చానని, ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు సీఎం. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల స్థలాలు ఇచ్చి తీరుతానన్నారు.


















