Nara Lokesh : అమరావతి : రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. బయటకు చెప్పు కోవడం వల్ల బాగుండదని, మన సమస్యలను మనమే పరిష్కరించు కోవాలని సూచించారు. గురువారం తన ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను (మ్యూచువల్, స్పౌజ్) విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న భాషా పండితుల సమస్యను పరిష్కరించడం పట్ల మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేకంగా కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు.
IT Nara Lokesh Key Comments
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. విద్యా శాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తి చేశామని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాల పైనే దృష్టి సారిస్తామని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టి దొంగ లెక్కలు చూపబోమన్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. విద్యా శాఖను ఛాలెంజింగ్ గా తీసుకున్నామని చెప్పారు. ఏపీలో విద్యా వ్యవస్థను నెంబర్ వన్ గా తీర్చి దిద్దాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు నారా లోకేష్. ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలని కోరారు. అభ్యసన ఫలితాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని తెలిపారు. దీనిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.
Also Read : Venkaiah Naidu Important Comments : ఉచితాలు కాదు అందరికీ విద్య, వైద్యం అందాలి


















