విశాఖపట్నం : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర మంత్రులతో పాటు ఏపీకి చెందిన మంత్రులు సైతం విశాఖలోనే ఉన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాధ్యమైనంత మేర బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం అని పేర్కొన్నారు. ప్రమాదం పీడకల అని అన్నారు .ప్లాంట్ గాడిన పడుతున్న దశలో ప్రమాదం జరగడం మరింత ఆవేదనకు గురి చేసిందన్నారు.
నడిపించలేమన్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి తో ప్లాంట్ లాభాల బాటలో పడుతోందని చెప్పారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామని, అంతే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. పిల్లల చదువు విషయం కూడా ఆలోచిస్తున్నామని, వారిని చదివించే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేశాం అన్నారు. ఆయా కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించామని తెలిపారు శ్రీనివాస్ వర్మ. ప్లాంటులో ఉత్పత్తికి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని ఆదేశించాం అన్నారు.
