విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా, పని పట్ల నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించారు. చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేసిందని, వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా పని చేస్తున్నాం. ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.. ప్రతి అడుగులో పాదర్శకత, జవాబుదారీతనంతో పని చేస్తున్నాం.. ఇందుకు ఉద్యోగులకు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని చెప్పారు.

















