అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. కొత్త ఏడాది సందర్భంగా తీపి కబురు చెప్పారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆదివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతోందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వచ్చామని అన్నారు. అంతే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందన్నారు.
గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం ఎదుర్కొందని అన్నారు. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదన్నారు. ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగం అని ఆయన స్పష్టం చేశారు. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పులపాలు చేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని మండిపడ్డారు. కానీ జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపాడని ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ.1.29 లక్షల కోట్లు అప్పులు మిగిల్చాడని మండిపడ్డారు.
















