అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. మనకు ఉన్న అవకాశాలను అన్లాక్ చేయగలిగాం. ప్రతి శాఖలోనూ సంస్కరణలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాలోనూ 25 టాప్ ప్రాజెక్టులను గుర్తించాలి. నియోజకవర్గానికి 10-15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. కోనసీమ కొబ్బరికి, వరికి ఫేమస్ కానీ ఇప్పుడు ఆదాయంలో వెనుకపడింది. నూతన ఆదాయ మార్గాల్ని అన్వేషించాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ఏలూరు జిల్లా ఇప్పుడు అత్యుత్తమ జిల్లాగా మారింది.
అందుకే అవకాశాలను అన్ లాక్ చేయాలని పదేపదే చెబుతున్నానని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిస్పందించే పాలన ద్వారా సుపరిపాలన అందించాలి. క్షేత్రస్థాయిలో ప్రజలను కలవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారంపై సత్వరం స్పందించాలి. జిల్లా కలెక్టర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి జ్ఞాపకాలను మిగుల్చు కోవాలి. మా హయాంలో పలానా జిల్లాలో ఈ పని చేశామని ప్రతి కలెక్టర్ గర్వంగా చెప్పుకునేలా పని చేయాలని అన్నారు.. రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి. ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంటే అంటే అభివృద్ధి-పాలన పెండింగ్ లో ఉన్నట్టే. ప్రభుత్వ సేవలు సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుందన్నారు సీఎం. నాకు పరిపాలన కంటే సుపరిపాలన ముఖ్యం అని స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో.. అభివృద్ధి సాధించే విషయంలో పోటీ పడాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
