హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేయాలంటూ పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిని సీరియస్ గా తీసుకుంది సర్కార్. వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఖాకీలు. తనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతామని ప్రకటించారు. భవన్ వద్ద మోహరించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలంగాణలో హింసను, ప్రభుత్వ ఆస్తులపై దాడులను, ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడియోను ఉటంకించారు. మోతా రోహిత్ ముదిరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బాల్క సుమన్ పై. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి సీనియర్ నాయకుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు తరలి రావడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. తీవ్రవాద నిరసనలకు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

















