Vande Bharat Sleeper : రైల్వేలు ప్రయాణికుల సౌకర్యాల కోసం మరింత ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ప్రయాణ అనుభవాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు సుదూర ప్రయాణాలను వేగవంతంగా, సౌకర్యవంతంగా, భద్రతతో కూడినవిగా మార్చనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు.
Vande Bharat Sleeper – ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు
వందే భారత్ (Vande Bharat Sleeper) స్లీపర్ రైళ్లు ఇప్పటికే ఫీల్డ్ ట్రయల్స్లో విజయవంతమయ్యాయని మంత్రి తెలిపారు. ఈ రైళ్లలో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ తలుపులు, వై-ఫై సదుపాయం, ఎయిరోప్లేన్ తరహాలో శాంతికరమైన ఇంటీరియర్, మరియు సౌకర్యవంతమైన బెర్తులు ఉండనున్నాయి. ఇవి సెమీ-హైస్పీడ్ రైళ్లుగా నడుస్తాయి. అంతేకాకుండా, ప్రయాణ సమయంలో కుదుపుల్ని తక్కువగా అనుభవించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.
ఉత్పత్తి ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల రూపకల్పన పూర్తయిందని, 10 రైళ్లు తయారీ దశలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అలాగే, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మరో 50 రైళ్లు తయారవుతున్నట్లు తెలిపారు. మొత్తంగా 200 రైళ్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, పలు సంస్థలకు ఒప్పందాలు అప్పగించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు ప్రైవేట్ భాగస్వామ్యాలు
ఈ ప్రాజెక్టులో కైనెట్ రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థకు 120 రైళ్లు (ప్రతి రైలుకు 16 కోచ్లు) తయారీ బాధ్యత అప్పగించారని తెలిపారు. అయితే, కొన్ని సాంకేతిక మార్పులు జరిగాయని, ఇప్పుడు 24 కోచ్లతో 80 రైళ్లు తయారవుతున్నాయని స్పష్టం చేశారు. అన్ని మార్పులు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టీకరించారు.
త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం
ఈ కొత్త తరహా స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు మరింత అభివృద్ధి చెందిన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. రాబోయే కొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.
Also Read : PM Kisan Interesting Update : ఎట్టకేలకు పీఎం కిసాన్ పై కీలక అప్డేట్ ఇచ్చిన కేంద్ర సర్కార్
