హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తను నిర్వహిస్తున్న శాఖపై పట్టు సాధించలేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పవర్ లో ఉన్న మీరు గతంలో అధికారంలో లేని సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు మార్చి 30, 2016లో మీరు స్పీకర్ కు రాసిన లేఖ మరిచి పోవడం భావ్యం కాదన్నారు. స్వయంగా మీరే రాశారని అన్నారు. అసెంబ్లీలో ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం అని మీకు తెలియదా.. అందుకే తాము అసెంబ్లీని బాయ్ కాట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు హరీశ్ రావు.
ఇవాళ మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఈ ఉత్తరంపై నేటి ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క , పద్మావతి కూడా సంతకాలు చేశారని అన్నారు. ఈ ఒక్క ఉత్తరం చాలు కాంగ్రెస్ పార్టీ అనైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి అని పేర్కొన్నారు హరీశ్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు వల్లెవేస్తారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. స్పీకర్ ని బీఏసీ సమావేశంలోనూ, ఉత్తరం ద్వారా కూడా , అధికార పక్షానికి ప్రెజెంటేషన్కు అనుమతి ఇస్తే, బీఆర్ఎస్ కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని కోరిందన్నారు. అయినప్పటికీ, ఆ అభ్యర్థనను తిరస్కరించారంటూ ఫైర్ అయ్యారు.


















