అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏపీ ఫస్ట్ కు శ్రీకారం చుట్టింది. ఉత్తర్వుల ప్రకారం సహకార ఆవిష్కరణ వ్యవస్థను దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరిశోధనా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, స్టార్టప్లు , ప్రభుత్వ శాఖలను ఒకచోట చేర్చుతుంది. సాంకేతికత వాణిజ్యీకరణను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్–ఫ్యూచర్ ఇన్నోవేషన్, రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ’ ని కంపెనీల చట్టం కింద ‘సెక్షన్ 8’ కంపెనీగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి , ప్రాధాన్యత రంగాలలో పరిశోధన-ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసినట్లు పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పేర్కొన్నారు.
ఈ చొరవ ఏరోస్పేస్ , రక్షణ, అంతరిక్ష సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికతలు, ఆరోగ్యం, బయో టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి, గ్రామీణ , వ్యవసాయ సాంకేతికతలు, అధునాతన పదార్థాల పై దృష్టి సారిస్తుందన్నారు. ఇది అమలు-కేంద్రీకృత పరిశోధనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఆర్థిక, ఆర్థికేతర చర్యల ద్వారా ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే, ప్రధాన మంత్రికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి కేంద్ర సంస్థలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం , బయోటెక్నాలజీ విభాగం వంటి శాఖలతో సమన్వయం చేసుకుని ఈ చొరవ దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని అన్నారు.
















