హైదరాబాద్ : కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ లో కీలకమైన మార్పులు తీసుకు వచ్చామన్నారు. దేశ మంతటా రైల్వే స్టేషన్లను , లైన్లను ఆధునీకరిస్తున్నామని చెప్పాడు. అంతే కాకుండా ప్రయాణీకుల భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ముంబై, గుజరాత్ నగరాల మధ్య రాక పోకలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి. వచ్చే ఏడాది ముంబై – అహ్మదాబాద్ నగరాల మధ్య కొత్త రైలు ప్రారంభిస్తామని తెలిపారు అశ్విని వైష్ణవ్. తెలంగాణకు మూడు కొత్త కారిడార్లతో సహా పలు మార్గాలకు కేంద్రం ఆమోదం లభించిందన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తన సహచర మంత్రి అశ్విని వైష్ణవ్ను సత్కరించారు.
హైదరాబాద్లోని HICCలో జరిగిన “విక్షిత్ భారత్-2047లో సాంకేతికత పాత్ర” అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు; ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, అనేక సాంకేతిక సవాళ్లను పరిష్కరించడంలో , ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తృత అవకాశాలను కల్పించడంలో AI సహాయపడుతోందని వైష్ణవ్ పేర్కొన్నారు. తెలంగాణలో నాలుగు ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని, మంజూరైన మూడు సెమీకండక్టర్ కేంద్రాలలో ఒకదానిలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు.

















