బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పొగాకుకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సులపై పొగాకు సంబంధిత ప్రకటనలపై బ్యాన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కన్నడ కార్యకర్తలు ఇటీవల ఆర్టీసీ బస్సుల నుండి పొగాకు సంబంధిత ప్రకటనలను తొలగించడం చర్చ నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ బస్సులపై పొగాకు సంబంధిత ప్రకటనలపై ప్రజల ఆగ్రహం వ్యక్తం కావడంతో, కర్ణాటక రవాణా మంత్రి రామలింగ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని అన్ని రోడ్డు రవాణా సంస్థలను పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను వెంటనే నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రదర్శించబడిన వాటిని తొలగించాలని ఆదేశించారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లకు జారీ చేసిన అధికారిక నోట్లో ఈ ఆదేశాన్ని తక్షణమే అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

















