ధర్మశాల : హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. చాలా మంది ఆటగాళ్లు ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే నానా తంటాలు పడతారు. ఆడలేక తమ వికెట్లను పారేసుకుంటారు. కానీ భారత క్రికెట్ జట్టులో ఎంత ఒత్తిడి ఉన్నా జంకకుండా ప్రత్యర్థుల బౌలర్లను అటాక్ చేయడంలో ముందు వరుసలో నిలుస్తారు విరాట్ కోహ్లీ, సంజు శాంసన్ , తిలక్ వర్మ. తాజాగా ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ధర్మశాల మైదానంలో కీలక మ్యాచ్ జరిగింది ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య. ముందుగా బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది.
అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే దాడి చేయడం మొదలు పెట్టింది. ఓపెనర్ రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకు తోడుగా రోహిత్ శర్మ ఆశించిన మేర రాణించలేదు. రూథర్ ఫర్డ్ తో కలిసి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దంచికొట్టాడు. మైదానం నలు వైపులా కళ్లు చెదిరేలా షాట్స్ ఆడుతూ ఆకట్టుకున్నాడు. చివరకు గెలుస్తామని ఆశించిన పంజాబ్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. వారి ఆశలపై నీళ్లు చల్లాడు. తను 33 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. మ్యాచ్ చివరి దాకా నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ గెలిచి తన పరువు పోకుండా కాపాడాడు జట్టును.
