హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ గోల్ఫ్ క్రీడల నిర్వహణ కోసం మద్దతు ఇస్తుండడం పట్ల అభినందించారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్కు అందిస్తున్న నిరంతర మద్దతును కపిల్ దేవ్ అభినందించారు. ఈ టోర్నమెంట్ తెలంగాణ, హైదరాబాద్లను ముఖ్యమైన గోల్ఫ్-పర్యాటక గమ్య స్థానాలుగా ప్రోత్సహించడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు.వేదికను అందించినందుకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్ పోటీతత్వ ప్రొఫెషనల్ గోల్ఫ్కు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించినందుకు హెచ్జీఏ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుల భాగస్వామ్యం, హెచ్జీఏ సభ్యులకు అత్యున్నత స్థాయి పోటీ గోల్ఫ్ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ టోర్నమెంట్ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ కోర్సుకు ప్రపంచవ్యాప్త గుర్తింపును కూడా అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో హెచ్జీఏ ప్రవేశ పెట్టిన గోల్కొండ ఫోర్ట్ ట్రోఫీ కోసం పాల్గొనే క్రీడాకారులు పోటీ పడతారు.
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ సెప్టెంబర్ 1 నుండి 4 వరకు జరగనుంది. ఇందులో మొత్తం ₹1 కోటి ప్రైజ్ పర్స్ కోసం 132 మంది గోల్ఫ్ క్రీడాకారులు పోటీపడనున్నారు. ఈ టోర్నమెంట్లో ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్స్తో పాటు విదేశీ గోల్ఫ్ క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్కు అధికారిక ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్ (OWGR) పాయింట్లు ఉంటాయి . ఇది ‘రేస్ టు డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్షిప్’లో ఒక భాగం. ఈ ఈవెంట్, డీపీ వరల్డ్ పీజీటీఐ నెం. 1 ప్లేయర్ను మరియు సీజన్ ముగింపులో జరిగే డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్షిప్కు అర్హత సాధించే టాప్ 24 ప్లేయర్లను నిర్ణయించడంలో దోహద పడుతుంది.
2015లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం దీనికి తన మద్దతును అందిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో డీపీ వరల్డ్ సీఈఓ అమన్దీప్ జోల్, చెక్ రిపబ్లిక్కు చెందిన అంతర్జాతీయ గోల్ఫర్ స్టెపాన్ డానెక్, అలాగే అధికారులు, స్పాన్సర్లు , భాగస్వాముల ప్రతినిధులు, పోటీలో పాల్గొంటున్న గోల్ఫర్లు పాల్గొన్నారు.



















