న్యూఢిల్లీ : వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఎంపికపై తీవ్రంగా స్పందించాడు. తన స్థానం ఉంటుందో లేదోనన్న చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఉన్నట్టుండి నోరు విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టి20 మ్యాచ్ లో శాంసన్ కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ప్రధానంగా వరల్డ్ టాప్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. భారత జట్టులో టాప్-ఆర్డర్ స్థానాల కోసం ఉన్న తీవ్రమైన పోటీ సవాలుతో కూడుకున్నదని, ఎంపిక నిర్ణయాల గురించి బాధపడుతూ కూర్చునే సమయం ఆటగాళ్లకు ఉండదని అతను అంగీకరించాడు.
తన కెరీర్ గమనం గురించిన చర్చలు ఆగవని అతనికి బాగా తెలుసు. నేను ఆ ‘వై-ఫై’ (బయటి చర్చలు/వ్యాఖ్యలు) ఆపేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, అప్పుడు సీనియర్ ఆటగాళ్ల వ్యాఖ్యలు కనిపిస్తాయి. అది చాలా సహజం. అది వారి ఇష్టం అని నేను భావిస్తాను అని మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ శాంసన్ అన్నాడు. కొన్నిసార్లు అది వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా వారి ఇష్టం. వారు సానుకూలమైన మాటలు వాడవచ్చు లేదా ప్రతికూలమైన మాటలు వాడవచ్చు. కాబట్టి, దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేంత పరిణితి, అనుభవం నాకు వచ్చాయని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నాడు సంజూ భాయ్.
మొదట్లో బాధగా అనిపిస్తుంది. నేను యంత్రాన్ని కాను, రోబోను కాను. అది కచ్చితంగా ప్రభావం చూపుతుంది. దానివల్ల కొంచెం బాధ కలుగుతుంది. కానీ ఆ తర్వాత మనకు మనమే సర్దిచెప్పుకుని, అసలు మనం ఎవరు, మనం ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెడతాం అన్నాడు. భారతదేశంలో క్రికెటర్లపై బయటి చర్చల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నానని అని ఒప్పుకున్నాడు సంజూ శాంసన్.


















