తిరుపతి : నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సమష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, మే 28న జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. జూన్ 1న గరుడవాహన సేవ, జూన్ 4న రథోత్సవం, కళ్యాణోత్సవం, జూన్ 5న చక్రస్నానం బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన, వైభవోపేతమైన ఘట్టాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శ్రీవారి కల్యాణోత్సవంను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని అన్నారు.
ఆలయ రథం స్థితిని పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని, వాహన సేవలకు అవసరమైన తండ్లు, ఘటాటోపం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్కౌట్స్, శ్రీవారి సేవకులను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలు, ఆలయానికి అవసరమైన ఇత్తడి పాత్రలు, పోటు కార్మికుల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూల్ పెయింటింగ్, త్రాగునీటి సదుపాయాలు, రంగవల్లులు, డ్రైనేజీ, పారిశుధ్య పనులను పూర్తి చేయాలని తెలిపారు. రద్దీ రోజుల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పెండింగ్ ఇంజినీరింగ్ పనులను మే 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్నారు. ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నారాయణవనంలో భక్తి పారవశ్యాన్ని మరింత పెంపొందించాలని జెఈవో పేర్కొన్నారు.
అనంతరం జెఈవో మాడవీధులు, ఇంజినీరింగ్ పనులను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


















