నల్లగొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును కోల్పోవడంతో కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. పేద విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు మంత్రి. ఈ సందర్బంగా పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందాలన్న నా చిరకాల కల అని స్పష్టం చేశారు. ఈ కల ఈ రోజు నల్గొండ బొట్టుగూడలో నిజమైందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో, 2500 గజాల స్థలంలో సకల ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగిందని, తాను జీవితంలో మరిచి పోలేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా కాక వాటిని మించిన ఆధునిక హంగులతో రూపుదిద్దుకుందని చెప్పారు.
మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వాల్డార్ఫ్ విద్యా విధానం, డిజిటల్ క్లాస్రూమ్స్ , కంప్యూటర్ ల్యాబ్స్, ప్రతి గదిలో ఏసీ సౌకర్యం, స్టెమ్ విద్యతో ఈ పాఠశాల ప్రత్యేకతను చాటుతోంది. అనుభవాత్మక విద్య ద్వారా భావి శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

















