బెంగళూరు : కర్ణాటక సర్కార్ తీపి కబురు చెప్పింది సీనియర్ జర్నలిస్టులకు. సమాజాన్ని సరిదిద్దడానికి , మార్గనిర్దేశం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి శ్రీకారం చుట్టింది. 60 ఏళ్లు పైబడిన అందరు జర్నలిస్టులు వైద్య విద్యా శాఖ పరిధిలోని అన్ని ఆసుపత్రులలో వైద్య చికిత్సపై 75% రాయితీని పొందేలా నిర్ణయం తీసుకుంది. కేవలం నామమాత్రపు రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి , రాయచూర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్. పాటిల్ అన్నారు.
వైద్య విద్య శాఖ, జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , సీనియర్ జర్నలిస్ట్స్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పాటిల్ ప్రసంగించారు. ముఖ్యమంత్రితో సంప్రదించి, మిగిలిన 25% చికిత్స ఖర్చులపై రాయితీ మంజూరు చేయడంపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు మన ప్రభుత్వ బాధ్యత. పదవీ విరమణ చేసిన సీనియర్ జర్నలిస్టులు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపగలరని నిర్ధారించు కోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు శరణ్ ప్రకాశ్ పాటిల్.

















