అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో మీరంతా మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యం ఏంటో ఆ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. ఇప్పుడు మనకున్న ఈ నాయకత్వ బలాన్ని, పార్టీ సంస్థాగత నిర్మాణంగా మార్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. 18 వేల మంది సాధక్స్ మనకు బలంగా ఉన్నారని చెప్పారు. గతంలో కొందరు నాయకులకు పార్టీ నిర్మాణ బాధ్యతలు ఇస్తే, వారు దానిని ముందుకు తీసుకెళ్లలేక పోయారని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. పార్టీ అంటే కేవలం పెద్ద పెద్ద నాయకులు కాదు. క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యులే పార్టీకి అండ అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తెనాలి టౌన్లో ఉదయం టైలరింగ్ పని చేసుకుంటూ, పార్టీ భావజాలం నచ్చి సభ్యత్వాలు చేయించిన శివ లాంటి వాళ్లను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని ప్రశంసించారు. అలాంటి సామాన్య కార్యకర్తల వల్లే ఈ రోజు జనసేన పార్టీ ఉంది. వాళ్లే పార్టీకి నిజమైన ఊపిరి ని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం . నన్ను అర్థం చేసుకునే వాళ్లు నా చుట్టూ ఒక పది మంది ఉండి ఉంటే, ఈపాటికి జనసేన సభ్యత్వాలు తక్కువలో తక్కువ కోటికి చేరేవని అన్నారు. చిన్నపాటి ఈదురు గాలికి చెదిరిపోయే బలహీనమైన సమూహాలు జనసేన పార్టీకి అవసరం లేదన్నారు. జనసేన సిద్ధాంతాలను బలంగా నమ్మిన 18 వేల మంది సాధకులు మనకు ఉన్నారని ప్రకటించారు.















