కర్ణాటక : కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. రోజుకు ఒకరు తలోరీతిన మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరింత హీట్ ను పెంచుతున్నారు. వారు చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో. దీనిపై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాజాగా కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలకు. ఇదే సమయంలో ఆయన బాంబు పేల్చారు. ఈ సందర్బంగా ఆయన సీఎం మార్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన బాగనే ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ సర్కార్ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.
అయితే సీఎం మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ప్రతి ఒక్కరు ఆశిస్తారని, అలా ఆశించడంలో తప్పు లేదన్నారు. ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ తమ పార్టీలో మాత్రమే ఉందన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. అందుకే కొందరు తమ వాయిస్ ను వినిపిస్తున్నారని చెప్పారు. చివరకు ఎవరు ఎవరి గురించి కామెంట్స్ చేసినా అది కేవలం వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగానే భావించాల్సి ఉంటుందన్నారు పరమేశ్వర. కాగా కర్ణాటక సీఎం నిర్ణయం పూర్తిగా పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. వారి దృష్టిలో ఎవరు పర్ ఫెక్ట్ అని భావిస్తారే వారే అంతిమంగా సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు.
