ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఖమ్మం జిల్లాలో అధికారికంగా పర్యటించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని పనులను ప్రారంభించారు మల్లు భట్టి విక్రమార్క. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం మాట్లాడారు.
మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా భౌగోళిక పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు.
వైరా నది వరదల నుంచి మధిరకు శాశ్వత విముక్తి కల్పించేందుకు రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణాలపై శాస్త్రీయ టెక్నికల్ సర్వే ఆధారంగా ముందుకు వెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నాం అని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క. సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. మధిరను రోల్ మోడల్ గా నిలపేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే కావాల్సిన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క.















