న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ). ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొంది. సమాజంలో మీడియా పాత్ర కీలకమని, ఏదైనా అవాస్తవమని తేలినా లేదా డ్యామేజ్ జరిగిందని భావించినా ఫిర్యాదు చేయాలే తప్పా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపినట్లు తాము భావిస్తున్నామని తెలిపింది. ప్రధానంగా రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కు ప్రమాదం ఏర్పడిందని పేర్కొంది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా.
రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఎలాంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించ లేదని స్పష్టం చేసింది.. దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే జర్నలిస్టులపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. అర్ధరాత్రి ఇంటిపై దాడులు చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్లో ఉంచడం పట్ల మండిపడింది. అపకీర్తి జరిగిందని భావించిన గుర్తుతెలియని మహిళా అధికారిణి కాకుండా, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.

















