జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తరపున ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన జనసేన అభ్యర్థులను ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది అని అన్నారు. స్థానిక సంస్థల్లో మీరు వేసిన అడుగు చాలా పెద్దదని ప్రశంసించారు. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలు పెడదాం అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉందన్నారు. మీ విజయం బలమైన మార్పుకి నాంది కావాలని కోరారు. అంతే కాదు తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు కొణిదల పవన్ కళ్యాణ్.
పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలు పెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలని సూచించారు. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారని ప్రశంసించారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెడతామని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. పోటీ చేసిన సంఖ్యలో 50 శాతం విజయం సాధించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ మద్దతుదారులుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని చక్కగా వినియోగించు కోవాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు , తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లెలకు మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
















