హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనకు ఒక రోజు టైం అనేది వస్తుందని అన్నారు. ఆ దేవుడి దయ వల్ల రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావడం పక్కా అని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆరోజు మాత్రం గత 2014 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని బండారాలను బయట పెట్టి తీరుతానంటూ ప్రకటించారు. తాజాగా కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.
ఇదే సమయంలో తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారం రోజుల లోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు , బీజేపీఎల్పీకి చెందిన ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించామన్నారు కల్వకుంట్ల కవిత. తన భర్త ఎప్పుడూ ప్రభుత్వ భూములపై వ్యాపారం చేయలేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూమిపై వ్యాపారం చేయలేదన్నారు. ఐడీపీఎల్ సమీపంలోని భూమికి నాకు లేదా నా భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత.
కూకట్పల్లి ఎమ్మెల్యే కుమారుడు ప్రణీత్ ప్రణవ్ విల్లాల్లో భాగంగా ఉన్నారని ఆరోపించారు. అక్కడ వారు ఒక సరస్సును ఆక్రమించి ప్రజలకు ప్రవేశం నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాకు దమ్ముంటే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు.
















