అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రోజు రోజుకు టెక్నాలజీ వినియోగం మరింత పెరిగిందని, దీనిని గుర్తించి అందుకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా టెక్నాలజీని ఉపయోగించు కోవాలని, విస్తృతంగా వినియోగించు కునేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. ప్రపంచంతో మనం పోటీ పడాలని పిలుపునిచ్చారు.
లేకపోతే ఆ వేగాన్ని అందుకోలేక పోతే మరింత వెనుకబడి పోతామని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవడం వల్ల క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. ఇక నుంచి డేటా డ్రివెన్ గవర్నెన్స్పై మరింత దృష్టి సారిస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. మన మిత్ర-వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 878 ప్రభుత్వ సేవలను అందిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారుల వెల్లడించారు ఈ సందర్భంగా. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.

















