TCS : దేశంలోని అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, తాజా త్రైమాసికంలో సంస్థలో మొత్తం 19,755 మంది ఉద్యోగులు సంస్థను వీడారు. వీరిలో కొంతమంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిపెట్టగా, మరికొందరు లేఆఫ్స్కు గురైనట్లు సమాచారం. ఈ ప్రక్రియలో ఉద్యోగుల పరిహారాల కోసం కంపెనీ రూ.11.35 బిలియన్లను కేటాయించింది.
TCS Huge Layoffs
టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సందీప్ కున్నుమల్ ప్రకారం, సంస్థను వీడిన వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. నైపుణ్యాలు మరియు ప్రస్తుత వ్యాపార అవసరాల మధ్య పొంతన కుదరకపోవడం వలన ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
మార్చి 2026 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా సిబ్బంది సంఖ్యను 2 శాతం మేర తగ్గించే లక్ష్యాన్ని టీసీఎస్ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆ టార్గెట్లో సగం మేర పూర్తయినట్లు తెలుస్తోంది. సంస్థ ప్రస్తుతం ఏఐ (Artificial Intelligence), ఆటోమేషన్, మరియు డిజిటల్ సర్వీసులపై ఎక్కువ దృష్టి పెట్టడంతో, అవసరమైన నైపుణ్యాల ప్రకారం ఉద్యోగుల నిర్మాణంలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో, యూఎస్ వర్క్ వీసాలపై ఆధారపడకుండా ఉండేలా టీసీఎస్ తన వ్యూహాలను మార్చుకుంటోంది. వలస విధానాల మార్పులకు అనుగుణంగా తమ బిజినెస్ మోడల్ను సర్దుబాటు చేసుకుంటున్నట్లు సందీప్ కున్నుమల్ తెలిపారు.
అలాగే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డాటా ఎనలిటిక్స్ నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడంపై దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీసీఎస్లో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు భారత ఐటీ రంగంలో రాబోయే మార్పుల దిశను సూచిస్తున్నాయి.
Also Read : Today Gold Price : నేడు పసిడి ధరలకు రెక్కలు
