తిరుపతి : అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో గోవింద నామ స్మరణల మధ్య స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.సాయంత్రం 4 నుండి 4.30 గంటల వరకు కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేయగా, 4.30 నుండి 6.30 గంటల వరకు ఆర్జిత కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.అదే రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించారు.
ఈ వాహనసేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
