తిరుపతి : చిన్నారుల్లో సనాతన ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించి, వారి విద్యారంభం, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలనే సంకల్పంతో టిటిడి జూలై 3 నుండి తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా “అక్షర గోవిందం” , అన్నప్రాశన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయ బద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేక “అక్షర గోవిందం కిట్” అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చు. అక్షర గోవిందం కిట్లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా, విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు
జూలై 4 నుండి మంగళవారం మినహా అన్ని రోజుల్లో వకుళమాత ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ బ్యాచ్ కు 25 మంది చిన్నారులు చొప్పున రెండు బ్యాచ్లలో మొత్తం 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందస్తుగా ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరు కావాలని టిటిడి సూచించింది.
