GST : సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పన్ను రేట్లను తగ్గించింది. టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, డిష్వాషర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీని (GST) 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడం వినియోగదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలిచింది. అయితే ఈ మార్పు వల్ల మొబైల్ ఫోన్లు చౌకగా లభిస్తాయా అన్న సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది.
GST – మొబైల్ ఫోన్లపై ఎలాంటి మార్పు లేదు
ప్రస్తుతానికి మొబైల్ ఫోన్లు 18 శాతం జీఎస్టీ స్లాబ్లో ఉన్నాయి. తాజా నిర్ణయం కేవలం టీవీలు, ఏసీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల మొబైల్ ఫోన్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండదు. వినియోగదారులు కొత్త ఫోన్లకు ఇప్పటివరకు చెల్లించిన రేట్లనే కొనసాగించాల్సి ఉంటుంది.
జీఎస్టీ స్లాబ్లలో కీలక మార్పు
ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుండి రెండుకు తగ్గించింది. 12 శాతం, 28 శాతం స్లాబ్లను రద్దు చేసి, వాటి పరిధిలో ఉన్న ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం కేటగిరీలకు మార్చారు. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన వాహనాలు వంటి విలాసవంతమైన వస్తువులకు ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రవేశపెట్టారు.
మొబైల్ వినియోగదారులకు ప్రభావం?
గతంలో మొబైల్ ఫోన్లను 12 శాతం స్లాబ్లోకి మార్చే అవకాశం ఉందని చర్చ జరిగింది. అయితే 12 శాతం స్లాబ్ను తొలగించడంతో ఆ అవకాశం రద్దయింది. ఫలితంగా మొబైల్ ఫోన్ కొనుగోలుదారులు ఈ మార్పు వల్ల ఎటువంటి లాభం పొందడం లేదు. అంతేకాక మొబైల్ ఫోన్ రిపేర్ సేవలపై కూడా 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది.
Also Read : UPI Interesting Update : యూపీఐ రోజువారీ లిమిట్ ను పెంచిన ఎన్పీసీఐ
