జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆరంభం నుంచి అదుర్స్ అనిపించిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇప్పుడు పడుతూ లేస్తూ వస్తోంది. తాజాగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో సత్తా చాటింది ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ టీం. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 55 రన్స్ చేస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ 84 రన్స్ చేశాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. దీంతో తనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అనంతరం 230 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలోనే 152 పరుగులకే చాప చుట్టేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఇద్దరే బాగా ఆడారు. జడేజా 25 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 38 రన్స్ చేస్తే వైభవ్ సూర్య వంశీ 16 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్సర్లతో 36 రన్స్ చేశారు. జేసన్ హొల్డర్ 12 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల బాట పట్టింది. ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. తన ప్లేస్ ను ఖరారు చేసుకుంది. మరో వైపు అసలైన కీలక మ్యాచ్ ఇవాళ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం కానుంది.
