చెన్నై : భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా స్క్వాడ్ పై స్పందించాడు భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుభ్ మన్ గిల్ ను తప్పించడం సబబేనని పేర్కొన్నాడు. గత కొంత కాలంగా తను భారత జట్టుకు భారంగా మారాడని పేర్కొన్నాడు. మంగళవారం తాను ఓ ఛానల్ తో అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రత్యేకించి గత్యంతరం లేని పరిస్థితుల్లో సంజూ శాంసన్ ను ఎంపిక చేయక తప్పలేదన్నాడు. ఒక రకంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ లను పరోక్షంగా తీవ్రంగా చురకలు అంటించాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్.
ఇదే సమయంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. తనను ఎంపిక చేయడం వంద శాతం కరెక్టేనని పేర్కొన్నాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కె. శ్రీకాంత్. అతను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అదెంత అద్భుతమైన ఇన్నింగ్స్. అతను ఆడిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చాడు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, చాలా విధ్వంసకరంగా ఆడుతున్నాడు. నేను సంజూకి చెప్పేది ఒక్కటే 37 పరుగుల వద్ద అవుట్ అవ్వకు. ఆ 37 పరుగులను 73గా మార్చు అని సూచించాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్. నువ్వు అలా చేస్తే, నిన్ను జట్టు నుండి తొలగించడం సాధ్యం కాదన్నాడు.
