అమెరికా : ఓపెన్ ఏఐ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా కార్యకలాపాల పర్యవేక్షణకు సంధ్య దేవనాథన్ను నియమించింది. ఓపెన్ ఏఐ కొత్తగా సృష్టించిన ఈ పదవిలో ఆ ప్రాంతంలో కంపెనీకి అత్యంత సీనియర్ నాయకురాలిగా ఆమె వ్యవహరిస్తారు. 60 కోట్లకు పైగా జనాభా కలిగిన మార్కెట్లలో వృద్ధిని సాధించే లక్ష్యంతో ఓపెన్ ఏఐ దీర్ఘకాలంగా ‘మెటా ప్లాట్ఫారమ్స్ లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారిని ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా విభాగాలకు నాయకత్వం వహించేందుకు నియమించుకుంది. సంధ్య దేవనాథన్ ఈ కొత్త పదవిలో ఆ ప్రాంతానికి సంబంధించి కంపెనీ అత్యున్నత స్థాయి నాయకురాలిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల సంఖ్య పెంపు, సంస్థాగత వినియోగం , భాగస్వామ్యాలు, కార్యకలాపాలు అలాగే నియంత్రణ సంస్థలతో సమన్వయం వంటి అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు. సంధ్య దేవనాథన్ అక్టోబర్లో తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ తాను ‘మెటా’ను వీడుతున్నట్లు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు.
అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఆమె నియామకాన్ని ఓపెన్ ఏఐ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. వినియోగదారులను ఆకర్షించే విషయంలో ఓపెన్ ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ ‘గూగుల్’ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది; ముఖ్యంగా ఆసియాలోని అధిక జనాభా కలిగిన మార్కెట్లు దీనికి గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయి. కంపెనీ సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ వినియోగదారుల పరంగా ఓపెన్ ఏఐకి ఉన్న టాప్-10 మార్కెట్లలో రెండు – ఇండోనేషియా , ఫిలిప్పీన్స్ – ఆగ్నేయాసియాలోనే ఉన్నాయి. దేవనాథన్ సింగపూర్ కేంద్రంగా పని చేస్తారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కిరణ్ మణికి రిపోర్ట్ చేస్తారు . ఆమె 2016లో మెటాలో చేరారు . ఇటీవల వరకు భారత్ మరియు ఆగ్నేయాసియా విభాగాలకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అంతకు ముందు ఆమె ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మెటా యొక్క గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహించినట్లు ఆమె ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లలో ఓపెన్ ఏఐ సింగపూర్, టోక్యో, సియోల్, సిడ్నీ , న్యూఢిల్లీలలో కార్యాలయాలను ప్రారంభించింది. అలాగే ఆ ప్రాంతంలో తన నాయకత్వ బృందాన్ని విస్తరించింది; ఇందులో భాగంగా కిరణ్ మణితో పాటు, జూన్లో ‘ఉబర్ టెక్నాలజీస్’ నుండి భారత్ వ్యాపారానికి నాయకత్వం వహించేందుకు నియమించుకున్న ప్రభ్జీత్ సింగ్ కూడా ఉన్నారు.
