హైదరాబాద్ : ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన సీఎం తానే తమ పార్టీకి చెందిన జెండాలను కూల్చాలని పిలుపును ఇవ్వడం దారుణమన్నారు. ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా ఎందుకు డీజీపీ శివధర్ రెడ్డి మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బ తీస్తున్నాడని, నేరాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయిందంటూ మండిపడ్డారు హరీశ్ రావు.
ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చ గొడుతుంటే రాష్ట్ర డీజీపీ నిద్ర పోతున్నాడా అని నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరోటి కాదన్నారు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మాజీ మంత్రి .

















