అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే భోగాపురం ఎయిర్ పోర్టు ఇక్కడ నిర్మిస్తున్నామని ప్రకటించారు. గత పాలకుల వల్ల భోగాపురం ఎయిర్ పోర్టు ఆలస్యమైందని ఆరోపించారు. 2026 ఆగస్టు నాటికి భోగాపురం ప్రారంభిస్తామన్నారు. విజయనగరం పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. వంశధార, నాగావళి, తోటపల్లి , తారకరామ, తీర్ధసాగర్ సహా అనేక ప్రాజెక్టులను తామే ప్రారంభించామన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తమని ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేయడం వల్ల నీటి ఎద్దడి తీరుతుందన్నారు.
రూ. 25 కోట్లు వ్యయంతో సార్వగడ్డ మినీ రిజర్వాయర్ రెండేళ్ల లోగా పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారులకు జెట్టీ కట్టిస్తామన్నారు. శాసనాపల్లి సమీపంలో హై లెవల్ బ్రిడ్జ్ మంజూరు చేస్తామన్నారు. మర్రివలస నుంచి గజపతి నగరం వరకూ నూతన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అటు విశాఖ నగరానికి టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయని వెల్లడించారు సీఎం. సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా నిర్మాణం అవుతోందన్నారు. రూ. కోటీ 47 లక్షలతో ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. విశాఖ, రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో దేశమంతటా రవాణాకు కనెక్టివిటీ మెరుగవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
