ముంబై : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియా లాంటి రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలన్నారు. అప్పుడే ఇంధన రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. డీజిల్, పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధనాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి అనేది కీలకం అని చెప్పారు సీఎం. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే మనకు ప్రయోజనాలు ఉంటాయన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం అని పేర్కొన్నారు. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం అన్నారు.
ప్రోజ్యూమర్ అనే విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన చేసి త్వరలోనే ఎగుమతులు సాధించ గలుగుతాం అని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దేశంలో ఆనాటి పీఎం పీవీ నరసింహరావు తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆద్యం పోశాయన్నారు. గతంలో సౌర విద్యుత్ ప్యానళ్ల కోసం చైనాపై ఆధారపడే వాళ్లం అన్నారు. ఇప్పుడు వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలుగుతున్నాం అన్నారు. గ్రీన్ అమ్మోనియా లాంటి వాటి ద్వారా ఈ ఇంధన లక్ష్యాలను చేరుకోగలుగుతాం అని చెప్పారు సీఎం. డేటా సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందన్నారు.

















