RBI Repo Rate sensational : వడ్డీ రేట్లపై కీలక అప్డేట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంకు గవర్నర్

ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపింది...

Hello Telugu - RBI Repo Rate sensational

Hello Telugu - RBI Repo Rate sensational

RBI : పండుగ కాలంలో వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశించిన రుణగ్రహీతలకు నిరాశే ఎదురైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై రెట్టింపు సుంకాలు విధించడంతో, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.

RBI Repo Rate Update

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంతేకాక, వడ్డీరేట్లపై తటస్థ దృక్పథాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వర్షపాతం సానుకూలంగా ఉండడం, పండుగ సీజన్‌లో కొనుగోళ్లు పెరగడం వంటివి దేశ ఆర్థిక వృద్ధికి సహకరించినా, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపింది.

వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై ఆర్బీఐ ప్రకటన

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధిరేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంతర్జాతీయ మాంద్యం మధ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతోందని గవర్నర్ పేర్కొన్నారు. వర్షాభిక్షం సానుకూలంగా ఉండటం, ధరలు తగ్గడం, ఉత్పత్తి సామర్థ్యం పెరగడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు దోహదపడనున్నదని వెల్లడించారు.

వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతం నుండి 3.1 శాతానికి తగ్గించినట్టు వెల్లడించింది. అయితే జూన్‌లో నమోదైన 2.1 శాతం కనిష్ఠ స్థాయి ద్రవ్యోల్బణం, సంవత్సరాంతానికి 4 శాతానికి పైగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

ద్రవ్యోల్బణంపై సుంకాల ప్రభావం తక్కువే

అమెరికా సుంకాల ప్రభావం భారతదేశ ద్రవ్యోల్బణంపై పెద్దగా ఉండదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రతీకారంగా భారత్ సుంకాలు విధిస్తే కొంత ప్రభావం ఉండొచ్చని చెప్పారు. వినియోగదారుల ధరల సూచీలో సగం వరకు ఆహార వస్తువులే ఉండటంతో, వాటి ధరలు అంతర్జాతీయ పరిణామాల కన్నా దేశీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలపై గవర్నర్ కౌంటర్

భారత ఆర్థిక వ్యవస్థను ‘మృతవ్యవస్థ’గా ట్రంప్ అభివర్ణించిన దానిపై ఆర్బీఐ (RBI) గవర్నర్ ఘాటుగా స్పందించారు. ప్రపంచ వృద్ధిలో భారత్ పాత్ర అధికమైందని, భారత్ వృద్ధిరేటు 6.5 శాతం కాగా, అమెరికా వృద్ధిరేటు అంతకన్నా తక్కువగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారత్ వాటా 18 శాతం కాగా, అమెరికా వాటా 11 శాతమేనని వివరించారు.

చిన్న మదుపరుల కోసం కొత్త పెట్టుబడి మార్గాలు

చిన్న మదుపరులకు ప్రభుత్వ ఖజానా పత్రాలలో పెట్టుబడి అవకాశాలను విస్తరించేందుకు, రిటైల్ డైరెక్ట్ వేదికలో క్రమానుగత పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించింది. ఆటో బిడ్డింగ్ సౌకర్యంతో మదుపరులు ట్రెజరీ బిల్లుల ప్రాథమిక వేలంలో సులభంగా పాల్గొనగలుగుతారు.

ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌ల పరిష్కారంలో సరళత

మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌ల పరిష్కారంలో సరళత తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. నామినీలకు క్లెయిమ్‌ను వేగంగా మరియు సమస్యలేనిది చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదా త్వరలో విడుదల కానుంది.

జీడీపీ, ఐఐపీ, సీపీఐకు కొత్త ప్రామాణిక సంవత్సరం

జాతీయ స్థాయిలో ఆర్థిక గణాంకాల ప్రామాణికతను మెరుగుపరిచే క్రమంలో, కేంద్ర ప్రభుత్వం జీడీపీ, పారిశ్రామికోత్పత్తి సూచీ, వినియోగదారుల ధరల సూచీకి కొత్త ప్రామాణిక సంవత్సరాలను ప్రతిపాదించింది. జీడీపీ, ఐఐపీకి 2022–23, సీపీఐకి 2024 సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరం (బేస్ ఇయర్)గా ప్రకటించింది.

Also Read : Donald Trump Tarrifs Shocking : ట్రంప్ టారిఫ్ విధించడంపై భారత్ షాకింగ్ రియాక్షన్

Exit mobile version