హైదరాబాద్ : వరల్డ్ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇవాళ ఇండియాకు రానున్నారు. మెస్సీ గోట్ టూర్ లో భాగంగా తను మూడు రోజుల పాటు పర్యటిస్తారు. కోల్ కతా, ఢిల్లీ, ముంబైతో పాటు హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని ప్రముఖులను మెస్సీ కలుస్తారు. శనివారం మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాడు లియోనెల్ మెస్సీ. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళతారు. విందు అనంతరం రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు వెళతారు.
ఉప్పల్ మైదానంలో మెస్సీ , సీఎం రేవంత్ రెడ్డిల మధ్య కీలకమైన ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉండగా మెస్సీ టూర్ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. స్టేడియం దగ్గర విధుల్లో 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అయితే కేవలం మ్యాచ్ టికెట్లు ఉన్నవాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నారు. కాగా లియోనెల్ మెస్సీ , సీఎం రేవంత్ రెడ్డిల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ చూసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు టీపీసీసీ వెల్లడించింది.
