హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు , అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో అమాయకులైన నిరుద్యోగులను అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు కనీసం 10 వేల జాబ్స్ కూడా ఇవ్వనందుకు బాధ్యత వహించాలని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు గాను రాహుల్ గాంధీని హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లులో ఉరి తీయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరి తీయాలని అన్నారు.
420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. విద్యా, వైద్యం పూర్తిగా అద్వాన్నంగా తయారైందని, ఇప్పటి వరకు సర్కార్ వాటిపై దృష్టి సారించక పోవడం దారుణమన్నారు. కొలువుల భర్తీ పేరుతో తమకు నచ్చిన వారికే ఇచ్చారంటూ ఆరోపించారు. ఇక తమ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాలు, కేజీబీవీలు , హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇదే క్రమంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. పట్ట పగలే హత్యలు, మాన భంగాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు కేటీఆర్.
















