అమరావతి : టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ-ఆస్పత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆస్పత్రుల యజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆస్పత్రులు కలిసి టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి-రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కరరావు సీఎంకు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆస్పత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశామని… అలాగే జీఎస్ఎల్లో ఉన్న రోగికి నారాయణ ఆస్పత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు.
దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు ఆస్పత్రుల యజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు.

















