హైదరాబాద్ : తెలంగాణలో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రం ఆదుకోవాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల తలెత్తిన సవాళ్లను పరిష్కరించడంలో కేంద్రం మద్దతు కోరేందుకు మాదాపూర్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద మొదటి దశలో తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి గతంలో జూలైలో ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని ఆయన చౌహాన్ను కోరారు. సమావేశంలో తెలంగాణపై ఎల్ నినో ప్రభావం గురించి ముఖ్యమంత్రి వివరించారు .
వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీరు , విద్యుత్ కొరతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే వ్యవసాయ రంగంలోని సవాళ్లను పరిష్కరించడానికి కేంద్రం నుండి అవసరమైన మద్దతు కోరారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని (సన్న బియ్యం) సరఫరా చేస్తున్నామని, అలాగే సన్న రకం వరిని పండించే రైతులకు రూ. 500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు సీఎం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 250 ఎకరాల పండ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు గురించి కూడా వివరించారు.
పంట వైవిధ్యీకరణను చేపట్టేలా రైతులను ప్రోత్సహించడంలో సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న చౌహాన్, రాబోయే రబీ పంటకు సంబంధించిన వ్యూహాలపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.















